నరసరావుపేట: ఉపాధి హామీ పథకం కింద వెంటనే పనులు కల్పించి, పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను సత్వరమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వంకాయలపాటి వి.శివనాగరాణి డిమాండ్ చేశారు. ఈ నెల 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని ఉపాధి హామీ వేతనదారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు దుగ్గి సుజాత అధ్యక్షతన నిర్వహించారు. శివ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ పనులు లేక వేలాది మంది కూలీలు ఉపాధి హామీ పనులపై ఆధారపడుతున్నప్పటికీ అధికారులు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. పనులు కోరితే ‘పనులు లేవు‘, ‘నిధులు వస్తాయో రావో తెలియదు‘, ‘వారానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది’ వంటి సాకులు చెబుతున్నారని అన్నారు. ఉపాధి హామీ పనులు చేసి ఎనిమిది వారాలు గడిచినా వేతనాలు చెల్లించకపోవడంతో కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యుద్ధప్రాతిపదికన ఉపాధి హామీ పనులు ప్రారంభించి, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే మరింత ఉధృతమైన ఆందోళనలకు వేతనదారులను సిద్ధం చేయాలని సంఘం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంఘం జిల్లా కార్యదర్శి జి.రవిబాబు మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి మూడు సెంట్ల ఇళ్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా నాయకులు నాగేశ్వరావు, ఎస్.లూథర్, పి.ఆశీర్వాదం, బి.బాలకోటయ్య, కెకె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శివ నాగరాణి


