సర్కారుకు బుద్ధి చెప్పే రోజులొస్తాయి..
వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్వంలో ర్యాలీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా దాటొచ్చి పాల్గొన్న శ్రేణులు విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు నిరుద్యోగ యువతను మోసం చేసిన చంద్రబాబు సర్కారు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున ధ్వజం డీఎస్సీలో అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ హాజరైన నియోజకవర్గాల సమన్వయకర్తలు, కీలక నేతలు
నిరుద్యోగులను మోసగించిన చంద్రబాబు
బాపట్ల: వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన నిరసన హోరెత్తింది. ప్రభుత్వ తీరును ఎండగడుతూ వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టిన నిరసనలో విద్యార్థులు, యువత అత్యధికంగా పాల్గొన్నారు. నిరసన కార్యక్రమానికి భారీగా తరలివచ్చే అవకాశం ఉందని నిఘా విభాగాలు ప్రభుత్వానికి తెలియజేయడంతో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఎల్లావుల సోహిత్, పార్టీ పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్బాబు, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చల్లా రామయ్యలను ముందస్తుగా అరెస్టు చేశారు. నాయకులు, కార్యకర్తల నుంచి భారీ నిరసనలు వ్యక్తం కావడంతో వారిని విడుదల చేశారు. పార్టీ పార్లమెంటు పరిశీలకుడు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, పర్చూరు, చీరాల, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల సమన్వయకర్తలు గాదె మధుసూదన్రెడ్డి, కరణం వెంకటేష్బాబు, వరికూటి అశోక్బాబు, పీటా నాగమోహన్కృష్ణ, పార్టీ నియోజకవర్గాల పరిశీలకులు మోదుగుల బసవ పున్నారెడ్డి, సురేంద్రల నాయకత్వంలో భారీగా నిరసన కార్యక్రమం జరిగింది.
భారీ స్పందన
నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేయడంతోపాటు, డీఎస్సీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ చేపట్టిన నిరసనలో భారీగా పార్టీ శ్రేణులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. పార్టీ జెండాలతో నిర్వహించిన నిరసనతో బాపట్ల హోరెత్తింది. కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, రాష్ట్ర, జిల్లా నాయకులు నక్కా వీరారెడ్డి, దొంతిబోయిన జయ భారత్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, చింతల రాజశేఖర్, శీలం చంటి, ఉప్పలపాటి అనిల్చౌదరి, నీలం వీరేంద్ర, ఉరబిండి గోపీనాథ్, ఆట్ల ప్రసాదరెడ్డి, గుర్రం మురళి, జోషికాంత్, వడ్డిముక్కల డేవిడ్, రవితేజ, చిక్కాల సాగర్, మౌలాలి, అశ్వినీ రెడ్డి, గవిని కృష్ణమూర్తి, ఇనగలూరి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను దగా చేసిన లోకేష్
రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మేరుగ చందన్ నాగ్ మాట్లాడుతూ.. విద్యార్థులను మోసం చేయడానికే కూటమి ప్రభుత్వం వచ్చిందని మండిపడ్డారు. అందులోనూ అసమర్థుడైన నారా లోకేష్కు విద్యాశాఖను కేటాయించడం బాధాకరమని పేర్కొన్నారు. ఒక కాంట్రాక్టు ఉద్యోగికి ఎంతో బాధ్యత కలిగిన డీఎస్సీ బాధ్యతలు అప్పగించడం ఏమిటంటూ ప్రశ్నించారు. క్రీడల కోటా పేరుతో దొడ్డిదారిన పార్టీ నాయకులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇప్పించారని దుయ్యబట్టారు.
ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ.. మోసాల ప్రభుత్వానికి విద్యార్థులే సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. అత్యధిక మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు రాకుండా, తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇవ్వడం దారుణమన్నారు. వీటిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
కూటమి సర్కారుకు సరైన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. డీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగికి స్టేట్ ర్యాంకు వచ్చిందంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు. నీట్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్లే, డీఎస్సీలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో అక్రమాలపై వెంటనే సీబీఐతో విచారణ చేపట్టాలన్నారు.
జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య మాట్లాడుతూ.. నిరుద్యోగులను నట్టేట ముంచిన చంద్రబాబు నాయుడికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలని పేర్కొన్నారు. అదే జరిగి ఉంటే ఒక్కొక్కరికి రూ.78 వేల వరకు వచ్చేవని చెప్పారు. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం ఎప్పటికీ నిలబడదని హెచ్చరించారు.


