రెంటచింతల: రెంటచింతలలో బీజేపీ జెండా దిమ్మె ధ్వంసం చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహించారు. మాచర్ల–గుంటూరు రహదారిపై సోమవారం నిరసన తెలిపారు. టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య వివాదానికి దారి తీసింది. జాతీయ రహదారి పక్కనే రెండు నెలల కిందట బీజేపీ మండల అధ్యక్షులు ఇగుటూరి రాజశేఖర్రెడ్డి ఏర్పాటుచేసిన బీజేపీ దిమ్మెను సోమవారం కొందరు ధ్వంసం చేశారు. దీనిపై బీజేపీ నాయకులు ఆగ్రహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ నేతృత్వంలో నాయకులు మాచర్ల–గుంటూరు ప్రధాన రహదారిపై కొంత సమయం నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటుకు జెండా దిమ్మెను తొలిగించినట్లు స్థానిక టీడీపీ నాయకులు బదులివ్వడంతో ఇరు పార్టీల నాయకులు వాగ్వాదానికి దిగారు. బీజేపీ మహిళానేత లక్ష్మి విద్యుత్ స్తంభం కోసం తీసిన గుంతలోకి దిగి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కారంపూడి సీఐ శరత్బాబు, స్థానిక ఎస్ఐ నాగార్జున ఇరు పార్టీల నేతలతో చర్చలు జరిపారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తి అయిన వెంటనే బీజేపీ జెండా దిమ్మె ఏర్పాటుకు రహదారి వెంబడే స్థలం కేటాయిస్తామని వారు హామినిచ్చి సమస్యను పరిష్కరించారు.


