వేటపాలెం: వేగంగా వెళుతున్న రైలు తగలడంతో బాలుడు మృతి చెందాడు. దేశాయిపేట పంచాయతీ ఆనుమల్లిపేట సచివాలయం దగ్గరలో రైలు పట్టాల వద్ద సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆనుమల్లిపేటకు చెందిన ఎం. ఏడుకొండలు, వెంకటలక్ష్మి కుమారుడు గణేష్ (5) ఒకటో తరగతి చదువుతున్నాడు. తాత ఉదయం రైలు పట్టాల అవతల ఉన్న గొర్రెల మంద వద్దకు బాలుడుని తీసుకొని వెళ్లాడు. రైలు పట్టాలు దాటే సమయంలో వేగంగా చీరాల వైపు ఉంచి రైలు వస్తోంది. అయితే తాత బాలుడిని రైలు వస్తుంది రావద్దని చెప్పి ఆయన మాత్రం పట్టాలు దాటి వెళ్లాడు. బాలుడు పట్టాల ఇవతల ఆగి నిలబడి ఉండిపోయాడు. అయితే రైలు వెళ్లిన తరువాత చూడగా బాలుడు తలకు కంటి పక్కన గట్టి దెబ్బతగిలి కింద పడి ఉన్నాడు. గమనించిన తాత వెంటనే బాలుడిని ఇంటికి తీసుకెళ్లి అక్కడ నుంచి బాలుడు తండ్రి సహాయంతో మోటార్ బైక్ పై చీరాల వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు బాలుడికి చికిత్స అందించినప్పటికీ మృతిచెందాడు. రైలు పట్టాల పక్కనే నిలబడి ఉండటంతో రైలుకు సంబంధించిన ఇనుప వస్తువు తగిలి ఉంటుందని భావిస్తున్నారు. కుమారుడు మృతి చెందాడని విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. అప్పటి వరకు తమ ముందు ఆడుకుంటున్న తమ బిడ్డ మృత్యుబడికి చేరడంతో వారి బాధ వర్ణనాతీతంగా మారింది.


