భారీ జనసందోహం నడుమ అంతిమ యాత్ర భౌతిక కాయానికి నివాళులర్పించిన ప్రముఖులు
పావులూరు(చినగంజాం): మాజీ మంత్రి, రాష్ట్ర సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి అంతిమ యాత్ర కార్యక్రమం ఆదివారం ఆయన స్వగ్రామం అయిన ఇంకొల్లు మండలం పావులూరులో నిర్వహించారు. ఆదివారం ఉదయం 10.30 గంటల తరువాత ప్రముఖులు, అభిమానుల సందర్శన అనంతరం ప్రత్యేకంగా పూలతో అలంకరించిన అంతిమ యాత్ర(ఆఖరి మజిలీ యాత్ర) రథంపై ఆయన భౌతికకాయం ఉంచారు. బ్యాండు మేళం, బాణసంచాతో భారీ జనసందోహం, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు అనుసరించారు. గాదె వెంకటరెడ్డి పెద్ద కుమారుడు, పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డితో పాటు సోదరులు సుధాకరరెడ్డి, శ్రీకాంత్రెడ్డితో కలిసి వారి సొంత ఫార్మింగ్ స్థలం వరకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లారు. అనంతరం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు, బాపట్ల జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు గవిని శ్రీనివాస్, గాదె శివరామకృష్ణారెడ్డి, బొల్లెద్దు ప్రతాప్, బి.నరేంద్రరెడ్డి, బొర్రెపాటి శ్రీనివాసరెడ్డి, వారి చంద్రశేఖర్, దాసరి కిరణ్బాబు, పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి, పర్చూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి యడం బాలాజీ, వారి సోదరుడు లక్ష్మీదీపక్, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, రాయపాటి అరుణ నివాళులర్పించారు. అంతియాత్రలో బాపట్ల శాసనసభ్యుడు వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఒక గొప్ప నాయకుడు, ప్రజా సేవకుడు, నిరంతర ప్రజా సేవా తత్పరుడు వెంకటరెడ్డిని కోల్పోవడం బాధాకరం అన్నారు.


