బాపట్ల: సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానంలో ఒక బలమైన నాయకుడిగా ఎదిగారు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి. ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి పోరాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ రాజకీయవేత్తగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. హైదరాబాద్లో శుక్రవారం గాదె వెంకటరెడ్డి మృతి చెందారు. ఎప్పుడూ సమైక్యత వాదాన్ని వినిపిస్తూ ఒక సమైక్యతావాదిగా ఆయన వాసికెక్కారు. బాపట్లలో 2013 మే నెలలో ప్రథమాంధ్ర మహాసభల శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషా వికాసం కోసం ఆనాడు జరిగిన పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలనే ఒక మహా సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని గాదె వెంకటరెడ్డి దిగ్విజయంగా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. నైతిక విలువలకు కట్టుబడి తన జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితమై, రాజకీయ రంగాన పునరంకితమై పనిచేసిన అరుదైన అగ్ర నాయకుల్లో గాదె వెంకటరెడ్డి ఒకరిని చెప్పటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. పర్చూరు నియోజకవర్గంతోపాటు బాపట్ల ప్రాంతాభివృద్ధికి విశేష కృషి చేశారు. ఈప్రాంతంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి అంటే ఇది అని చేసి చూపిన గాదె వెంకటరెడ్డిని ఈప్రాంత ప్రజలు ఎప్పటికి స్థిరస్థాయిలో గుర్తిండిపోతారు.
గాదె మృతికి కోన సంతాపం
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతికి మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సంతాపం తెలిపారు. రాజకీయంగా ఎన్నో మెట్లు ఎక్కిన గాదె భావితరాలకు ఆదర్శమని గుర్తు చేసుకున్నారు. సంతాపం తెలిపిన వారిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు మోదుగుల బసవపున్నారెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశరరావు, మాజీ కౌన్సిలర్ షేక్.సయ్యద్ పీర్ ఉన్నారు.


