గుంటూరు మెడికల్: జూన్లో జరిగే మలేరియా వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణబాబు, జిల్లా మలేరియా అధికారి సుబ్బారాయణం సంయుక్తంగా అనుబంధ శాఖల విభాగాల అధికారులతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ దోమల నియంత్రణ మనందరి బాధ్యత అని అన్నారు. ప్రపంచ మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు జూన్ నెలలో జరుపుకోవాలన్నారు. ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలన్నారు. నివారణ, నియంత్రణ, చికిత్సకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ప్రతి శుక్ర వారం డ్రై డే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయాలన్నారు. సమావేశంలో డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ, ఎన్సీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్, డెమో బి శివసాంబిరెడ్డి, జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు.


