సత్తెనపల్లి: పట్టణంలోని రంగా కాలనీ17వ లైన్ చివర వ్యవసాయ పొలాల్లో రైల్వే ట్రాక్ నుంచి 100 మీటర్ల దూరంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు పట్టణ సీఐ మల్లికార్జునరావు గురువారం తెలిపారు. మృతుడు వయసు సుమారు 25 సంవత్సరాలు ఉంటాయని, వంటిపై డాలర్బిగ్బాస్ కంపెనీ ఫుల్ అండర్ వేర్ ధరించి ఉన్నాడని, కుడి చేతి భుజముపై లవ్ సింబల్ పచ్చబొట్టు ఉందని తెలిపారు. ఎత్తు 5.5 అడుగులు, చామనఛాయ రంగుతో ఉన్నాడన్నారు. ముక్కు నుంచి రక్తం వచ్చినట్లుగా ఉందని, నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడే ఉండి, మద్యంమత్తులో చనిపోయినట్లుగా అనిపిస్తుందన్నారు. ఆనవాలు గుర్తిస్తే పట్టణ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని కోరారు.
శావల్యాపురం: తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్ జలాలు విడుదల చేస్తున్నట్లు లింగగుంట్ల ఎన్నెస్పీ ఈఈ డివి సుబ్బారావు గురువారం తెలిపారు. ఈఈ సుబ్బారావు మాట్లాడుతూ ఈనెల 30న శావల్యాపురం మండలం గంటావారిపాలెం గ్రామ సమీపాన ఉన్న అద్దంకి బ్రాంచ్ కెనాల్కు 1000 క్యూసెక్కుల సాగర్ జలాలు తాగునీరు అవసరాల కోసం విడుదల అవుతాయన్నారు. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని మంచినీరు చెరువులు, వాగులు, కుంటలు నింపుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం మాచర్ల పరిధిలో బొగ్గువాగు నింపుతున్నట్లు తెలిపారు. మండలంలోని తాగునీటి చెరువులను సాగర్ చెరువులను ఎన్నెస్పీ, పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణలో నూరు శాతం నింపటానికి చర్యలు చేపట్టామన్నారు. సాగర్ జలాలు వృథా చేయరాదని, ఇతర అవసరాలకు వినియోగించరాదన్నారు.
రొంపిచర్ల: భువనేశ్వర్లో నిర్వహిస్తున్న నేషనల్ బాలికల సబ్ జూనియర్ బేస్బాల్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ జట్టు నాలుగో స్థానం దక్కించుకుందని రొంపిచర్ల జెడ్పీహెచ్ఎస్ వ్యాయామ ఉపాధ్యాయుడు వై సైదయ్య తెలిపారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్లో మహారాష్ట్ర–ఆంధ్ర జట్ల మధ్య నిర్వహించిన మ్యాచ్లో మొదటి ఐదు ఇన్నింగ్స్లో 1–1 స్కోర్తో ఆట డ్రా అయింది. అదనంగా ఆడిన ఆరవ ఇన్నింగ్స్లో మహారాష్ట్ర జట్టు ఆంధ్రప్రదేశ్ జట్టును 2–1 తేడాతో ఓడించి మహారాష్ట్ర జట్టు ఫైనల్కు చేరుకుంది. భువనేశ్వర్లో జరుగుతున్న నేషనల్ బాలికల సబ్ జూనియర్ బేస్బాల్ టోర్నమెంట్లో దేశం మొత్తం మీద 26 రాష్ట్రాల జట్టు పాల్గొన్నాయి.


