వ్యవసాయ కళాశాల ఇన్చార్జి డీన్ డాక్టర్ చంద్రశేఖర్
బాపట్ల: తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన నందమూరి తారక రామారావు కేవలం సినీనటుడిగానే కాకుండా ప్రజల సంక్షేమాన్ని కాంక్షించిన మహోన్నత నాయకుడిగా చరిత్రలో నిలిచారని వ్యవసాయ కళాశాల ఇన్చార్జి డీన్ డాక్టర్ కె.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు గురువారం కళాశాలలో నిర్వహించారు. డాక్టర్ కె.చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తన జీవితమంతా క్రమశిక్షణ, సేవాభావం, ఆత్మవిశ్వాసం అనే విలువలను పాటించారని, సినీరంగంలో ఎన్నో అపూర్వ విజయా లను సాధించి తెలుగు కళాసౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారని గుర్తు చేశారు.ఎన్టీఆర్ రాజకీయ రంగంలో ప్రవేశించిన తర్వాత ముఖ్యమంత్రిగా తెలు గు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటమే తన లక్ష్యంగా ముందుకు సాగారని, ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తే ఎంతటి విజయాలనైనా సాధించవచ్చని ఆయన జీవితం గొప్ప సందేశాన్ని అందించిందన్నారు. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి డాక్టర్ బి.రవీంద్రరెడ్డి మాట్లాడుతూ సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్లు అనే నినాదంతో పేద ప్రజానీకానికి రెండు రూపాయలకే కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించడం వంటి అనేక పథకాలను అమలు చేసి ఎన్టీఆర్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం ఆయన నేర్పిన ముఖ్యమైన విలువలని, ఆయన సేవా భావాన్ని ఆదర్శంగా తీసుకొని వ్యవసాయ విద్యార్థులు నిజాయితీ, నిబద్ధతతో ముందుకు సాగారని తెలిపారు. డాక్టర్ టి. మధుమతి, డాక్టర్ కె.సుశీల, డాక్టర్ మురళీధర్ నాయక్, డాక్టర్ ఎన్.కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


