● చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు
● జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: గోవులను వధిస్తే జైలుకెళ్లడం ఖాయమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లాపోలీస్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను పురస్కరించుకొని జిల్లాలోని ఈద్గాలు, మసీదుల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గోవధ నిషేధం చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం బక్రీద్ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకున్నామన్నారు. గో సంరక్షణ చట్టం–2017, జంతు సంరక్షణ చట్టం–1977 ప్రకారం గోవుల అక్రమ రవాణా నేరమని, గోవులను వధించడం పూర్తిగా నిషేధమని, ఈ చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మతసామరస్యానికి భంగం కలిగించే విధంగా ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా సరిహద్దులతోపాటు జాతీయ రహదారుల్లోని టోల్ప్లాజాల వద్ద విస్త్రృత వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉంటే, ప్రజలు వెంటనే సమీప పోలీస్స్టేషన్కు, 100,112 నెంబర్లకు కాల్ చేసి సమాచారాన్ని అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.


