తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురువారం నృసింహ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళగశాసనాలతో ఉదయం 9 గంటలకు దుష్ట గ్రహ నివారణ, ఆయురా రోగ్యాభివృద్ధి కోసం లక్ష్మీ నారసింహ ఇష్టి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. సాయంత్రం లక్ష్మీనృసింహ స్వామి వారికి అభిషేకం, విశేష అలంకరణ, లక్ష్మీ నృసింహస్వామి కల్యాణం, అష్టోత్తర శతనామార్చన, నివేదన, మంగళాశాసనం, తిరు నక్షత్ర తనియన్ విన్నపం, తీర్థ ప్రసాద గోష్టి, వేద ఆశీర్వచనం, తదియారాధన కార్యక్రమాలు కనుల పండువగా నిర్వహించామని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుగ్రహాన్ని పొందారని పేర్కొన్నారు.
దుర్గి: దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలోని నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి హుండీ కానుకలు లెక్కించగా రూ.26,72,462 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణా ధికారి, అసిస్టెంట్ కమిషనర్ కె. ఆదిశేషు నాయుడు తెలిపారు. గురువారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ధర్మకర్త యాగంటి మల్లికార్జునరావు, కారంపూడి గ్రూప్ దేవదాయశాఖ కార్యనిర్వహణాధికారి హనుమంతరావుల సమక్షంలో 51 రోజులపాటు భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ లెక్కింపు చేపట్టారు. కానుకల రూపంలో వచ్చిన ఆదాయాన్ని బ్యాంకు అధికారులకు అందజేసి సంబంధిత రసీదును తీసుకున్నట్లు అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ఎన్ఎంఆర్ సిబ్బంది, అర్చక, పరిచారక, నాయీ బ్రాహ్మణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
తెనాలిరూరల్: మండలంలోని పెదరావూరు గ్రామంలోగల అభయ హస్త సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యా గణపతి, బాలాంబిక సమేత సర్వ హితేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు చింతపల్లి సుబ్రహ్మణ్యశర్మ, సహాయకుడు పోలేపెద్ది రామకృష్ణ, ఆలయ అర్చకుడు శుభం శర్మ, మార్కెట్ యార్డు వైస్చైర్మన్ పాలడుగు సురేంద్ర, కిక్కూరి శ్రీనివాసరెడ్డి తదితరులు జస్టిస్ రామసుబ్రమణియన్ దంపతులకు స్వాగతం పలికారు.
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళాద్రిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ముఖ మండపంలో గురువారం ఉదయం విశేష అభిషేకం, విశేష అలంకరణ నిర్వహించారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పార మాత్మిక నారసింహ హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామి నామకరణ మహోత్సవం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను శేష వాహనంపై అధిష్ఠింప జేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్కుమార్ పర్యవేక్షించారు.


