గుంటూరు వెస్ట్ : ప్రపంచ క్షయ వ్యాధి (టీబీ) దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సోమవారం వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన పోస్టర్ను కలెక్టరేట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. టీబీ నిర్మూలనకు సమష్టి కృషి అవసరం అనే థీమ్తో ఈ సంవత్సరం టీబఈ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు.
గుంటూరు వెస్ట్: ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తాము ఉన్నట్లు నిత్యం చెబుతున్న అధికారులు సామాన్యుల సమస్యల పట్ల దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఎన్నిసార్లు తిరిగినా సరైన సమాధానం కూడా చెప్పకపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు తమ అసహనాన్ని వ్యక్తం చేయగా కలెక్టర్ దీనిపై సీరియస్గా స్పందించారు. బాధితుల వివరాల ప్రకారం...
సిరిపురపు స్వరాజ్యలక్ష్మి (77) అనే వృద్ధ మహిళకు చెందిన సుమారు ఎకరం వ్యవసాయ భూమి చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో ఉంది. దీనిపై పూర్తి హక్కులకు సంబంధించిన దస్తావేజులు కూడా ఉన్నాయి. అయితే ఆమె పేరుతో అడంగుల్తోపాటు మీ భూమి వెబ్ ల్యాండ్ లో ఇతరులు అనే ఆప్షన్ లో నమోదు చేయమనడంతోపాటు , పట్టాదారు పాస్ పుస్తకం కోసం స్థానిక చేబ్రోలు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకున్నారు. సదరు కార్యాలయం సిబ్బంది ఈ ఫైల్ ను జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి పంపారు. ఇప్పటికి సుమారు మూడేళ్ళు గడుస్తున్నా ఈ ఫైల్కు మోక్షం లభించలేదు. సిబ్బంది నిర్లక్ష్యంతోపాటు అధికారుల ఉదాసీనత తోడవడంతో బాధితులకు చుక్కలు కనబడుతున్నాయి. దీంతో స్వరాజ్య లక్ష్మి కుమారుడు సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కలిసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని వృద్ధుల సమస్యలు గాలికి వదిలేస్తే ఎలా అని ప్రశ్నించారు. న్యాయం స్థానాన్ని ఆశ్రయించి మీ అందరి పేర్లు పెడతానని పేర్కొనడంతో కలెక్టర్ సదరు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు, వికలాంగుల సమస్యలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని తాను చెప్పాను కదా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని ఆగ్రహించారు. తప్పకుండా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో బాధితులు వెళ్ళిపోయారు.


