సాక్షి ప్రతినిధి, కడప: కడప నగరంలో స్థానిక ఎమ్మెల్యే మాధవీరెడ్డి దంపతుల నియంతృత్వ పోకడలు పతాక స్థాయికి చేరాయి. గత మహానాడు సభలో తాను ప్రతిష్టాత్మక మహాదాత బుడ్డా వెంగళరెడ్డి ఇంటి ఆడబిడ్డనని సగర్వంగా ప్రకటించుకున్న ఆమె.. తీరా ఆచరణలోకి వచ్చేసరికి ఆ మహానుభావుడికి కేటాయించిన స్థలంలోనే తన మామ విగ్రహాన్ని నెలకొల్పడం పట్ల చరిత్రకారులు మరియు ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఏకగ్రీవంగా కేటాయించిన స్థలంలో బుడ్డా వెంగళరెడ్డి విగ్రహ ఏర్పాటును నిబంధనల పేరుతో అడ్డుకుని.. అదే పీఠంపై రాత్రికి రాత్రే తన మామగారైన మాజీ మంత్రి రాజగోపాల్రెడ్డి విగ్రహాన్ని అక్రమంగా ప్రతిష్టించడం జిల్లావ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. కాగా, ఇంత జరుగుతున్నా కలెక్టర్ శ్రీధర్, ఇతర అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
డొక్కల కరవు రక్షకుడికి దక్కని గౌరవం!
రేనాడు ప్రాంతానికి చెందిన బుడ్డా వెంగళరెడ్డి 1866 నాటి డొక్కల కరవు సమయంలో వేలాది మంది ప్రజలకు అంబలి పోసి ప్రాణాలు కాపాడారు. ఆ దాతృత్వం గురించి తెలుసుకున్న విక్టోరియా మహారాణి ఆయన్ను మద్రాసుకు పిలిపించి ఘనంగా సత్కరించి, బంగారు పతకాన్ని బహూకరించారు. రాయలసీమ చరిత్రలో దాతృత్వానికి చిరునామాగా నిలిచిన బుడ్డా వెంగళరెడ్డి, తొలి స్వాతంత్య్రయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాలను కడప నగరంలో ఏర్పాటు చేయాలని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు నిర్ణయించారు. వీరి అభ్యర్థన మేరకు అప్పటి నగర మేయర్ కె.సురేష్బాబు హయాంలో ఒకసారి, పాకా సురేష్కుమార్ హయాంలో మరోసారి మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. రైతు బజారు కూడలి వద్ద బుడ్డా వెంగళరెడ్డి, ఐటీఐ సర్కిల్ వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాల ఏర్పాటుకు కార్పొరేషన్ పచ్చజెండా ఊపింది.
మాట తప్పిన తమ్ముళ్లు..
మహాదాత బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాల ఏర్పాటు భూమి పూజకు సహకరించాలని ఎమ్మెల్యే మాధవీరెడ్డి దంపతులను రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ, ఇంటాక్, రెడ్డి సేవా సమితి, లోక్సత్తా, ఏపీ రెడ్డి సంఘం, మానవత, ఏపీ దళితమిత్ర తదితర పార్టీలు, సంఘాల నాయకులు అప్పట్లో కోరారు. అయితే, సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నందువల్ల తాము ఈ కార్యక్రమానికి హాజరు కాలేమని.. మీరే ఏర్పాట్లు చేసుకుంటే అధికారుల నుంచి అభ్యంతరాలు రాకుండా కలెక్టర్తో తాను స్వయంగా మాట్లాడుతానని టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి అప్పట్లో ఆయా సంఘాలకు హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు అదే ప్రాంతంలో ఆయన తండ్రి, మాజీ మంత్రి రాజగోపాల్రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే అక్రమంగా నెలకొల్పడం గమనార్హం. బుడ్డా వెంగళరెడ్డి విగ్రహ ఏర్పాటుకు సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డంకి అయితే, ఇప్పుడు రాజగోపాల్రెడ్డి విగ్రహానికి అవి వర్తించవా అని పలువురు నిలదీస్తున్నారు. చరిత్రకారులపై ప్రజాప్రతినిధులు అత్యంత నిర్లక్ష్యం ప్రదర్శించారని విశ్లేషకులు, ప్రజాస్వామ్యవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కడపలో మాధవిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి దంపతుల నియంతృత్వం
అర్ధరాత్రి వేళ అక్రమంగా
మామ ఆర్ఆర్ విగ్రహం ఏర్పాటు
ఆచరణలో మహాదాత
వెంగళరెడ్డికి అవమానం
మున్సిపల్ కార్పొరేషన్
ఏకగ్రీవ తీర్మానం బూడిదపాలు


