పక్కా ఇంటి కోసం అంధ జంట విన్నపం
● సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్కు క్యూ కట్టిన జనం
● భూ సమస్యలకు రెవెన్యూ యంత్రాంగమే కారణం
● రీ సర్వేతో రైతుల జీవితాలతో చెలగాటం
మదనపల్లి (కురబలకోట): మదనపల్లిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి అర్జీలు వెల్లువెత్తాయి. జేసీ శివ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్రెడ్డి అర్జీలను స్వీకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సమస్యలతో వచ్చిన వారు అర్జీల ఆన్లైన్కు బారులు తీరారు. ముఖ్యంగా 90 శాతం మంది భూసమస్యలపై అర్జీలు ఇవ్వడం గమనార్హం. దీన్ని బట్టి జిల్లా స్థాయిలో భూ సమస్యల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండేళ్లుగా అర్జీలు ఇస్తున్నా ఆశించిన స్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు వాపోయారు. ఉన్నతాధికారులు పరిష్కరించాలని సూచించినా మండల స్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అనుభవంలో ఉన్న భూమి ఆన్లైన్ కాలేదని, భాగపరిష్కారం, 22ఎ భూమికి పరిష్కారం లభించలేదని, భూ కబ్జాలు, భూ అక్రమణలు, రెవెన్యూ ఉద్యోగుల లంచగొండితనం, ఆర్ఓఆర్ నమోదు లోపాలు, చుక్కల భూముల చిక్కులు, పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వడంలేదని, వన్బీకి డిజిటల్ కీ లేదని. రీ సర్వేలో భూమి విస్తీర్నం తగ్గించి ఇవ్వడం, భూ రికార్డులు ఉన్నా ఆన్లైన్ చేయడం లేదని, ఒకరి భూమిని మరొకరికి ఆన్లైన్ చేయడం,ఎఫ్లైన్, భూ సరిహద్దులు చూపకపోవడం, రీ సర్వేలో ప్రలోభాలకు తలొగ్గి అవకతవకలు వంటి వివిధ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తాయి.
● గ్రీవెన్స్డేలో భారత చైతన్య యువజన పార్టీ పీఏసీ పాల రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థుల హక్కులు, ప్రైవేటు టీచర్ల సమస్యలు, అనుమతి లేని విద్యా సంస్థల నియంత్రణపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
● పుంగనూరు మండలం గోపిశెట్టిపల్లికు చెందిన పలువురు తమకున్న అరకొర భూములను బస్సుల కంపెనీ పరిశ్రమ పేరుతో స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని ఇదే జరిగితే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని వాపాయా రు. న్యాయం చేయాలని వినతి పత్రమిచ్చారు.
● జలధార ప్రాజెక్టులో మొదటి స్థానంలో ఉన్నట్లుగా చంకలు గుద్దుకుంటున్న కలెక్టర్ కార్యాలయం పీజేఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం) సమస్యల పరిష్కారంలో మదనపల్లి నియోజక వర్గం రాష్ట్రంలో 136వ స్థానంలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం విఫలమైందనడానికి ఇదే నిదర్శనం. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో.. ఏం సమాధానం ఇస్తారో చూడాలి.
ఎన్నికల ముందు రైతుల సంక్షేమం కోసంపాటుపడతామన్నారు. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం రైతులను, వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. భూమి రైతులకు ఆస్తి మాత్రమే కాదు జీవనాధారం. భూ ఆక్రమణలు, భూ దోపిడీలు ఎక్కువయ్యాయి. రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యమైంది. భూ సమస్యలు పరిష్కరించే దిక్కులేదు. ఎన్ని అర్జీలు ఇచ్చినా న్యాయం జరగడం లేదు.
– చిన్న వెంకట్రమణ నాయుడు,
రైతు సంఘం నాయకుడు, ఎండపల్లి, ములకలచెరువు మండలం
వంద శాతం కళ్లు కన్పించవు. సదరన్ సర్టిఫికెట్ కూడా ఉంది. 2011 నుంచి వికలత్వ పింఛన్ వచ్చేది. పింఛన్ ఐడీ నెంబరు 131466. ఉన్నట్టుండి నిలుపుదల చేశారు. ఆస్తిపాస్తులు లేవు. ఇదే ఆధారం. ఎందుకు పింఛన్ రద్దయ్యిందో అర్థం కావడం లేదు. గ్రీవెన్స్డేలో రెండేళ్లుగా అర్జీలు ఇవ్వడం తప్ప పరిష్కారం కన్పించడం లేదు. ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం పోతోంది.
– ఎం.శంకర, అంధుడు, శ్రీరామ పురం,
ములకలచెరువు మండలం
పక్కా ఇంటి కోసం రెండేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోవడంలేదు. గ్రీవెన్స్డేలో అర్జీలు ఇస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇద్దరం అంధులమే. అయినా అధికార యంత్రాంగానికి జాలి కలగడం లేదు. పింఛన్ సొమ్ముతో బతుకుతున్నాం, పక్కా ఇల్లు వచ్చినా కట్టుకోలేమన్న భయంతో టిడ్కో ఇళ్లు కావాలని ఆశిస్తున్నాం. అధికారులు దయ చూపితే ఓ ఇంటివారం అవుతాం. – వెంకట్రమణ, అమృత, అంధ దంపతులు,
నేతిగుంటపల్లి, పుంగనూరు మండలం


