సాక్షి, మదనపల్లె : బి.కొత్తకోట నగర పంచాయతీలో జనాభా తగ్గుదలకు కారణాలు ఏమిటి అనే అంశంపై శనివారం జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. పట్టణంలోని వార్డుల్లో మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించారు. ఎన్యుమరేటర్లు సేకరించిన వివరాలపై ఆరా తీశారు. వివరాలు ఎలా నమోదు చేశారు, ఎక్కడ పొరపాటు జరిగాయి అన్న అంశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మండల పరిషత్, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల కంటే ఇప్పుడు నమోదు చేసిన జనాభా లెక్క ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. ఇళ్ల వివరాలు నమోదు చేస్తున్న ఎన్యుమరేటర్లు సంబంధిత ఇంటిలో ఎంతమంది ఉన్నారన్న సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోవాలని కోరారు. వలసలు వెళ్లినవారు, ఉపాధి ఉద్యోగాలకు వెళ్లిన వారి వివరాలు కూడా ముఖ్యమని, ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. 31 లోగా ఈ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ బావాజాన్, ఎంపీడీవో అబ్దుల్ సుకుర్, కమిషనర్ రమాదేవి, వివిధ శాఖల సిబ్బంది, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించిన డీఆర్ఓ


