జిల్ల్లా ప్రయోజనాలను కాపాడటంలో అధికార కూటమి ప్రజాప్రతినిధుల వైఖరి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉదంతమే నిదర్శనం. వైఎస్సార్ జిల్లాలో కూటమి తరఫున ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నా జిల్లాకు దక్కాల్సిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థను కాపాడుకోలేక చేతులెత్తేశారు. పులివెందులలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయి, 2025 విద్యాసంవత్సరానికి గానూ 50 ఎంబీబీఎస్ (MBBS) సీట్లు కూడా మంజూరయ్యాయి. అయితే, గత ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే కుళ్లు రాజకీయంతో.. ‘ఆ మెడికల్ కళాశాల మాకు అవసరం లేదు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) కు లేఖ రాయడం తీవ్ర దుమారం రేపింది. అన్ని వసతులతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కళాశాలను ఇలా తిరస్కరించడంపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. సొంత జిల్లాకు జరుగుతున్న ఈ అన్యాయంపై ఒక్కరంటే ఒక్క కూటమి ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద నోరు మెదపలేకపోయారు. జిల్లా ప్రయోజనాలను తాకట్టు పెడుతూ వీరంతా ‘వెన్నుముక లేని ప్రజాప్రతినిధులు’గా వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.


