కేవీపల్లె : టీడీపీ నాయకుడి దాడిలో గాయపడ్డ వీఆర్ఏ కుటుంబ సభ్యులను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. ఈ నెల 14న మండలంలోని గర్నిమిట్ట పంచాయతీ బలిజపల్లెలో శ్రీరాములవారి ఆలయ అభివృద్ధి, గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకానికి సంబంధించి గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆలయ ధర్మకర్తగా ఉన్న వీఆర్ఏ చెంగల్రాయుడుపై గర్నిమిట్టకు చెందిన టీడీపీ నాయకుడు పార్థసారధి అలియాస్ ధనుంజయ కర్రతో దాడి చేయడంతో తలకు గాయమైంది. ఆ రోజు నుంచి చెంగల్రాయుడు పీలేరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎంపీ ఆదివారం చెంగల్రాయుడు కుమారుడు నాగకు ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. వీఆర్ఏ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గజ్జెల శీన్రెడ్డి, నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు.


