సదుం : నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సదుం మండల వాసి ఆదివారం మృతి చెందారు. గ్రామస్తుల కథనం మేరకు.. కంభంవారిపల్లె పంచాయతీ కురవపల్లెకు చెందిన సుబ్రమణ్యం(59 వ్యక్తిగత పనుల నిమిత్తం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో హైదరాబాదుకు బయలుదేరారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆయన మృతి చెందారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.
స్విచ్ ఆన్ చేస్తుండగా
కరెంట్ షాక్
మదనపల్లె టౌన్ : ఇంట్లో ఉన్న ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయబోయిన వృద్ధురాలికి కరెంట్ షాక్ కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఆదివారం పెద్దమండెం మండలంలో చోటు చేసుకున్న ఘటనపై బాధితురాలు కుటుంబీకుల కథనం.. మండలంలోని అవికేనాయక్ తండాకు చెందిన గోబ్రే నాయక్ భార్య రెడ్డమ్మ (62) ఇంటిలో ఉన్న ఫ్యాన్ స్విచ్ వేయడంతో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కొట్టి తీవ్రంగా గాయపడింది. కుటుంబీకులు గమనించి చికిత్స కోసం వెంటనే బాధితురాలిని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, చికిత్స అనంతరం తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. ఘటనపై పెద్దమండెం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. కరెంటు షాక్ సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
నిర్మాణ పనులకు
నష్టం కలిగించారని ఫిర్యాదు
చింతకొమ్మదిన్నె : విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ పనులకు నష్టం కలిగించారని రైతులపై పోలీస్స్టేషన్లో రేజోనియా సంస్థ ప్రాజెక్టు మేనేజర్ రాజ్కుమార్ ఆదివారం ఫిర్యాదు చేశారు. అనంతపురం–2 ఆర్ఈజెడ్ నుంచి చింతకొమ్మదిన్నె మండల పరిధిలో నిర్మాణం చేపడుతున్న 765 కేవీ విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ పనులకు వ్యతిరేకంగా సంఘటితంగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఆదివారం బోడెద్దుల పల్లెకు చెందిన రైతు అజ్మాత్ పొలంలో అనుమతి లేకుండా చేపడుతున్న నిర్మాణ పనులు ఆపాలని బాధిత రైతుతోపాటు మండలంలోని ఇతర ప్రభావిత రైతులు కోరారు. దీంతో అక్కడ పనులు చేస్తున్న కంపెనీ సూపర్వైజర్ పనులను ఆపించారు. భూమి యజమాని కోరిన మేరకు నిర్మాణాల తొలగింపు పనులు కంపెనీ వారే చేపట్టారు. అయితే తమ నిర్మాణ పనులకు రైతులు నష్టం కలిగించారని రేజోనియా సంస్థ ప్రాజెక్టు మేనేజర్ రాజ్కుమార్ చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీఐ బాలమద్దిలేటిని సంప్రదించగా రాజ్కుమార్ ఫిర్యాదు మేరకు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బస్సులో ప్రయాణిస్తూ
యువకుడి మృతి
జమ్మలమడుగు రూరల్ : పెద్దపసుపల గ్రామానికి చెందిన భాస్కర్(32) అనే యువకుడు ఆదివారం తిరుపతి– జమ్మలమడుగు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా మృతి చెందాడు. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దముడియం మండలం పెద్దపసుపల గ్రామానికి చెందిన భాస్కర్ స్వగ్రామం వదలి కొన్నేళ్లుగా తాడిపత్రిలోని కొండెపల్లి గ్రామంలో ఉన్నాడు. కాగా ఆర్థిక సమస్యలతో 8 నెలల క్రితం స్వగ్రామమైన పెద్దపసుపలకు చేరుకున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం శనివారం కదిరికి వెళ్లాడు. ఆదివారం తిరిగి తిరుపతి నుంచి జమ్మలమడుగు వస్తున్న ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. బస్సు జమ్మలమడుగు పాతబస్టాండ్కు వచ్చినా.. సీటులో నుంచి లేవకపోవడంతో సిబ్బంది భాస్కర్ను లేపారు. కానీ లేవకపోవడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. ఆ మేరకు తండ్రి స్వామిదాసు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మృతి చెందడానికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
వృద్ధురాలికి తీవ్ర గాయాలు


