కేవీపల్లె : ట్రాక్టర్ బోల్తాపడి తొమ్మది మందికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని కలకటవారిపల్లె వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. మండలంలోని మారేళ్లలో మామిడికాయలు కోసి లోడు చేయడానికి తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలం ఇర్లపాళెంకు చెందిన 12 మంది కూలీలు ఆదివారం ట్రాక్టర్లో బయలుదేరారు. అయితే మార్గంమధ్యలోని కలకటవారిపల్లె మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జింకల జ్యోతి (32), గౌరీ(22), రమేష్(43), రాజేశ్వరి(35), టి.సుగుణ(28), పి.మౌనిక(20), పి. మనోహర(25)తోపాటు పిల్లలు శ్రీనక్షత్ర(2), సిద్దు(9) తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ లక్ష్మయ్యతోపాటు మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ వాహనంలో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


