మదనపల్లె టౌన్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఎంసెట్ పరీక్ష రాయడానికి వస్తున్న విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ములకలచెరువు మండలంలో చోటు చేసుకున్న ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు.. సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండలం, బుక్కపట్నం పంచాయతీ, యాతాల బంకకు చెందిన బాబు 19, నరేంద్ర 19 లు ద్విచక్ర వాహనంలో మదనపల్లిలోని ఓ సెంటర్లో ఎంసెట్ రాయడానికి బైక్ లో ఇంటి నుండి బయలుదేరారు. స్కూటర్ మార్గమధ్యంలోని ములకలచెరువు మండలం బురకాయలకోట వద్దకు రాగానే, ఆర్టీసీ బస్సు విద్యార్థుల బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు చికిత్స కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
మదనపల్లె టౌన్: శుక్రవారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని భవన కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై స్థానికుల కథనం.. మదనపల్లె బసినికొండ నిర్మితి కేంద్రం వద్ద రోడ్డు దాటుతున్న భవన కార్మికున్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లి పోయిందన్నారు. వెంటనే బాధితు డిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా డాక్ట ర్లు వైద్యం అందిస్తున్నారు. ఘటనపై తాలూక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వాహనం ఢీకొని జింక మృతి
పుంగనూరు: మండలంలోని బోడినాయునిపల్లె సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. గ్రామం అటవీప్రాంతానికి దగ్గరగా ఉండటంతో జింకలు తరచుగా తిరుగుతున్నాయి. ఈ సమయంలో జాతీయ రహదారిపైకి జింక రావడంతో గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోవడంతో జింక అక్కడికక్కడే మృతి చెందింది. దీనిని గమనించిన ఆప్రాంత వాసులు ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. ఫారెస్ట్ సిబ్బంది వెళ్లి జింకను పోస్టుమార్టంకు తరలించి, దహనక్రియలు నిర్వహించారు.


