కలెక్టర్ నిశాంత్ కుమార్
సాక్షి, మదనపల్లె: జిల్లాలో విద్యాభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుపై విద్యాశాఖ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని కలెక్టర్ నిశాంత్కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, సమగ్ర శిక్ష, స్కిల్ డెవలప్మెంట్, అనుబంధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడి పిలుస్తోంది కార్యక్రమంలో రాయ చోటి, పీలేరు, మదనపల్లి, వాయల్పాడు,గాలివీడు, పుంగనూరు మండలాల్లో నమోదు ప్రక్రియ తక్కువగా ఉందన్నారు. జిల్లాలోని 89 మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 కంటే తక్కువగా ఉందని, దీనిపై చర్యలు చేపట్టాలని సూచించారు. పదో తరగతి ఫలితాల్లో సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు చెప్పారు. ఇంటర్మీడియట్ ఫలితాల శాతం పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన వారి నివేదిక సిద్ధం చేయాలని కోరారు. సమావేశంలో డిఐఈఓ రవి, డిఈవో సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ, స్కిల్ డెవలప్మెంట్ అధికారి నాగార్జున పాల్గొన్నారు.


