పుంగనూరు : వేసవి తీవ్రంగా ఉండటంతో చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని పట్రపల్లె తండాకు చెందిన గణేష్నాయక్ కుమారుడు వరుణ్నాయక్(14), మణి నాయక్ కుమారుడు నిలేష్నాయక్(8) కలసి బడిగిరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు మధ్యాహ్నం వెళ్లారు. ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లి ఇద్దరూ మునిగిపోయారు. సమీపంలో బాతులు మేపుతున్న యువకులు గమనించి గ్రామస్తులకు తెలిపారు. అందరూ కలసి హుటాహుటిన వెళ్లి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు చిన్నారులకు కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదు.


