రాయచోటి : పెళ్లికి కట్నంగా తల్లిదండ్రులు ఇచ్చిన 50 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టడానికి ఒప్పుకోని గర్భిణి.. భర్త వేధింపులను భరించలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాయచోటి పట్టణ పరిధిలోని రాజుల కాలనీలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. రాజుల కాలనీలోని రెడ్డి బాషా, షేక్ రిహాబ్జాన్(19)కు 10 నెలల కిందట వివాహం అయింది. రెడ్డి బాషా ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం రిహాబ్జాన్ 7 నెలల గర్భవతిగా ఉంది. వీరికి వివాహ సమయంలో రిహాబ్జాన్ తల్లిదండ్రులు 50 గ్రాముల బంగారు ఆభరణాలను ప్రేమగా పెట్టారు. ఆ బంగారాన్ని భర్త రెడ్డి బాషా బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవాలనే క్రమంలో.. ఇద్దరు గొడవ పడుతుండే వారని ఇరుగు పొరుగు వారు తెలిపారు. సోమవారం రాత్రి కూడా బంగారు విషయంగా ఇద్దరు గొడవపడ్డారన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రిహాబ్జాన్ సోమవారం ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో చీరతో మోల్డింగ్ రాడ్డుకు ఉరి వేసుకుని తనువు చాలించింది. ఇరుగు పొరుగు వారు ఈ విషయాన్ని గమనించి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. సంఘటనపై రాయచోటి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రెడ్డి బాషాను పోలీస్లు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.


