రొంపిచెర్ల: రొంపిచెర్ల ఆదర్శ పాఠశాల తరగతి గదులను నూతన వసతులతో నిర్మించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. అయన మంగళవారం ఆదర్శ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 12వ తేదికి విద్యార్థులకు సౌకర్యంగా మొదటి అంతస్తు తరగతి గదులను నూతన వసతులతో పూర్తి చేసి విద్యార్థులకు అప్పగించాలన్నారు. తరగతి గదుల కొరత వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వెంటనే పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. ఈ నెల 14న జిల్లా కలెక్టరేట్లో ఆదర్శ పాఠశాలపై అదర్శ పాఠశాల ప్రిన్సిపల్, ఎంఈవో, కాంట్రాక్టర్, ఇంజనీర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు.ఈ సమావేశానికి ఆదర్శ పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలపై పూర్తి నివేదికలతో హాజరు కావాలని సూచించారు. ప్రిన్పిపాల్ రెడ్డిప్రదీప్, తహశీల్దార్ కిరణ్కుమార్, ఎంఈవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
హాస్పిటల్ భవన నిర్మాణ పనుల పరిశీలన
పులిచెర్ల(కల్లూరు): మండల కేంద్రమైన పులిచెర్లలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ హాస్పిటల్ కొత్త భవన నిర్మాణ పనులను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పరిశీలించారు. అనంతరం అక్కడి సిబ్బందితో మాట్లాడారు. భవన నిర్మాణం పనులు పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సురేంద్రనాథరెడ్డి, మెడికల్ ఆఫీసరు డా.వేణుగోపాల్రెడ్డి, స్థానిక నాయకులు ప్రభాకర్, తహసీల్దారు జయసింహ సిబ్బంది పాల్గొన్నారు.


