పీజీఆర్ఎస్కు 383 వినతులు
స్పెల్ బీలో జాతీయస్థాయిలో రెండో స్థానం సాధించిన విద్యార్థి బి.శైలేష్ను కలెక్టర్ నిశాంత్కుమార్ ప్రశంసించారు. సోమవారం డీఈఓ సుబ్రమణ్యం, ఏసీపీ అనురాధలు శైలేష్ను కలెక్టర్ వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల విద్యార్థులతో పోటీపడిన పెద్దమండ్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న శైలేష్ ఏప్రిల్ 22న ముంబైలో జరిగిన స్పెల్ బీ పోటీల్లో జాతీయస్థాయిలో రెండోస్థానం దక్కించుకుని పొందిన మెడల్, అవార్డు, కప్ను కలెక్టర్కు చూపించారు. దీనిపై ఆయన విద్యార్థి ప్రతిభను మెచ్చుకున్నారు
మదనపల్లె/అర్బన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు ప్రజల నుంచి 383 వినతులు వచ్చినట్లు కలెక్టర్ నిశాంత్కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఆయాశాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా అర్జీదారులతో నేరుగా మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇందులో నిర్లక్ష్యం తగదన్నారు. అర్జీలను పెండింగ్లో ఉంచరాదన్నారు. నాణ్యతగా, వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ శివ్నారాయణశర్మ, సబ్కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
కొన్ని అర్జీల వివరాలు..
ఆక్రమణదారులతో రెవెన్యూ అధికారులు కుమ్మకై ్క వారసత్వంగా సంక్రమించిన 15 ఎకరాల భూమిని ఆన్లైన్ నుంచి తొలగించి అన్యాయం చేశారంటూ కురబలకోట మండలం ఎర్రజేనుపల్లెకు చెందిన రెడ్డెమ్మ అర్జీ సమర్పించింది. తమ భూమిని ఆక్రమణదారుల పేరుమీద రాసి, అన్యాక్రాంతం చేశారంటూ బాధితురాలు వాపోయింది.
ఆక్రమణదారులు తమ భూమిని కబ్జా చేశారంటూ కురబలకోట మండలం నందిరెడ్డిగారిపల్లెకు చెందిన ఫిరోజ్ఖాన్ అర్జీ సమర్పించాడు. గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, జయారెడ్డిలు రెవెన్యూ అధికారుల అండతో 15 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
రెవెన్యూ అధికారులు రీసర్వేలో తమకు చెందిన 90 సెంట్ల భూమిని మాజీ సర్పంచి ఎంజీ మల్లయ్య కోడలు సుజాత పేరుమీద ఆన్లైన్ చేసేశారంటూ నందిరెడ్డిగారిపల్లెకు చెందిన అమీర్బాషా అర్జీ సమర్పించాడు. కలెక్టర్ ఎండార్స్మెంట్ ఇచ్చిన స్థలాన్ని ఆన్లైన్ చేయడంతో బాధితుడు తన గోడును కలెక్టర్కు విన్నవించాడు.
బి.కొత్తకోట పట్టణంలోని బీసీ కాలనీని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని స్థాని కులు వినతిపత్రం అందజేశారు. 35 ఏళ్ల క్రితం ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. స్థలాల్లో గృహ నిర్మాణ పథకం కింద, సొంతంగా పేదలు ఇళ్లను నిర్మించుకున్నారు. అయితే ఈ కాల నీ పరిధిలోని సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల మేరకు ఈ నిషేధం తొలగించి క్రయ, విక్రయాలకు అవకాశం ఇవ్వా లని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
మదనపల్లె సీటీఎం రోడ్డును వ్యాపార సంస్థలు ఆక్రమించడంపై బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ ఫిర్యాదు చేశారు.


