మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఆవులపల్లి పంచాయతీలో 75 ఏళ్ల వృద్ధ రైతు భూమిని ఆక్రమించేందుకు యత్నించి, కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రత్యర్థులు దాడి చేయడంతో బాధితులు ఆదివారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరారు. వారిని పరామర్శించిన సీపీఐ నాయకులు కష్ణప్ప, సాంబశివ, శ్రావణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. సోమల మండలం, ఆవులపల్లి పంచాయతీ, దేలకుప్పానికి చెందిన సుందరయ్యకు సర్వే నంబర్ 32/12లో 1.9 సెంట్ల పట్టా భూమి ఉందన్నారు. ఆదివారం ఉప్పరపల్లి పంచాయతీ నాగిళ్లవారిపల్లికి చెందిన యదుశేఖర్ నాయుడు, కోటినాయుడు తమ అనుచరులతో వచ్చి సుందరయ్య భూమిని జేసీబీతో ఆక్రమించేందుకు యత్నించారు.
అడ్డు వెళ్లిన సుందరయ్య, ఆయన కుమారుడు, కోడలిని కొట్టి సెల్ ఫోన్లు లాక్కొని దుర్భాషలాడుతూ ‘‘అడ్డొస్తే జేసీబీతో తొక్కిస్తాం’’ అంటూ బెదిరించారన్నారు. భూమిలో ఉన్న మామిడి చెట్లు, ఫారం పాండ్ ట్యాంక్, రాతి కూసాలు, కంచె ధ్వంసం చేశారని ఆరోపించారు. దీంతో సుమారు రూ.10 లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. గాయపడతాము చేసేదిలేక మదనపల్లి ప్రభుత్వాసుపత్రుల చేరి చికిత్స పొందుతున్నామని వాపోయారు.


