అట్లూరు : విధి నిర్వహణలో భాగంగా అనంతపురం జిల్లా కియా కంపెనీలో అట్లూరు మండలం జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. అట్లూరు మండలం ముత్తుకూరు పంచాయతీ జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన సొద్దల రామాంజనేయులు (24) కియా కంపెనీలో విధులు నిర్వహిస్తూ మూడు రోజుల క్రితం మృతి చెందాడు. మృతుని తల్లి, తమ్ముడు, చెల్లెలు ఇదివరకే మృతి చెందారు. తండ్రి లక్షుమయ్య ఉన్న ఒక్క కొడుకు రామాంజనేయులను కూలి పనులు చేసుకుంటూ బీటెక్ చదివించాడు. రామాంజనేయులు ఆరు నెలల కిందట కియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు రామాంజనేయులు మిషనరీలో పడి మృతి చెందాడు. విషయాన్ని కియా కంపెనీ యాజమాన్యం బంధువులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం జొన్నవరం ఎస్సీ కాలనీకి రామాజంనేయులు మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.


