మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో కారు ఢీకొని రైతు దుర్మరణం చెందిన విషాదకర సంఘటన శనివారం అమ్మ చెరువుమిట్ట వద్ద చోటు చేసుకుంది. ముదివేడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కురబలకోట మండలం దాదంవారిపల్లికి చెందిన వెంకటరెడ్డి కుమారుడు, రైతు సుధాకర్రెడ్డి (50) సొంత పని మీద బైక్పై మదనపల్లెకు బయలుదేరాడు. మార్గంమధ్యలోని మదనపల్లె అమ్మచెరువు మిట్ట వద్ద, ఏసీ గోడౌన్ సమీపానికి రాగానే వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుధాకర్రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రైతు మృతికి కారణమైన కారు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే వాహనంతో పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా కారును గుర్తించే పనిలో ఉన్నామన్నారు.


