పుంగనూరు : మా భూమిని మాకు అప్పగించి న్యాయం చేయాలని బాధితురాలు కోరుతున్నారు. మండలంలోని రాగానిపల్లెకి చెందిన దళిత మహిళ లక్ష్మమ్మ శనివారం విలేకరులతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆమె కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నరాయప్ప పేరుతో ఉన్న భూమి రికార్డులను.. రెవెన్యూ అధికారులు ధనికుల పేరుతో మార్చారని లక్ష్మమ్మ ఆరోపించింది. రాగానిపల్లెలో నివాసం ఉన్న చెన్నరాయప్పకు అదే గ్రామంలో సర్వే నంబరు: 337/3, ఖాతా నంబరు: 113లో 2 ఎకరాల 45 సెంట్ల భూమికి ప్రభుత్వం గతంలో పట్టా మంజూరు చేసి, పాసుపుస్తకం జారీ చేసింది. ఇదిలా ఉండగా రెవెన్యూ అధికారులు చెన్నరాయప్ప, లక్ష్మమ్మలకు తెలియకుండా చంద్రప్ప, గౌరమ్మల పేరుతో 1బి రికార్డులు మార్చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ విషయమై బాధితురాలు జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్లి పీజీఆర్ఎస్లో ఫిబ్రవరి 23న ఫిర్యాదు చేసింది. కానీ స్థానిక అధికారుల్లో చలనం లేకపోవడంతో ఆమె వీధిన పడింది. ఈ భూమికి సంబంధించి విచారణ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపిస్తోంది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతోంది.


