కురబలకోట : అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఎన్సీసీ క్యాడెట్లు రామిరెడ్డి లక్ష్మణ్, గంగరపు జ్యోతీశ్వర్, ఎం.భార్గవి జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమంలో హిమాలయ శిఖరాలను అధిరోహించి యూనివర్సిటీకి గర్వకారణంగా నిలిచారని వీసీ యువరాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 15 మంది ఎన్సీసీ క్యాడెట్లు హిమాలయన్ సెంటర్ఫర్ అడ్వెంచర్ అండ్ ఎకో టూరిజం నిర్వహించిన పర్వతారోహణ శిక్షణలో పాల్గొన్నారన్నారు. వీరిలో ముగ్గురు మిట్స్ విద్యార్థులు భాగస్వాములయ్యాయన్నారు. 6582 అడుగుల ఎత్తయిన హిమాలయ శిఖర ప్రాంతంలో ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్,పారా గ్లైడింగ్, రాక్ క్రాఫ్ట్, ఐస్ క్రాఫ్ట్ రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడల్లో పాల్గొని సత్తా చాటారన్నారు. క్యాంప్ కోర్సు డైరెక్టర్ కాజీ షెర్పా, ట్రైనింగ్ ఆఫీసర్ సకుల్ గిరి పర్యవేక్షణలో సాగిందన్నారు. యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ నాదేళ్ల విజయ భాస్కర్ చౌదరి. ప్రో చాన్స్లర్ నాదేళ్ల ద్వారకనాఽథ్ వీరిని అభినందించారు.


