పెద్దతిప్పసముద్రం: వర్గ విభేధాలకు తావు లేకుండా కలసి మెలసి మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు మండల పరిషత్ కార్యాలయంలో పని చేసే కొంత మంది అధికారులు తమకు సహకరించలేదని పలువురు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం సీఈఓ మండల కేంద్రానికి విచ్చేసి విచారణ చేపట్టారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఎన్ని ఉన్నాయి, ఏయే పనికి ఎన్ని రూ.లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, చెత్త నిర్వహణ ఎలా ఉంది, బ్యాటరీతో నడిచే ఈ ఆటోలు ఉన్నాయా, మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా చెత్తరహిత మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా తాగునీటి ఎద్దడి నివారణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోతుపేట, దేవప్పకోట గ్రామ పంచాయతీల్లో సచివాలయాలు లేక ఈ గ్రామాల్లో పని చేసే అధికారులు ప్రజలకు ఉపయోగకరమైన గ్రామ సభలు నిర్వహించాలంటే చెట్ల కింద, రచ్చ బండల వద్ద జరపాల్సిన దుస్థితి నెలకొందన్నారు. భవనాల నిర్మాణం కోసం ప్రత్యేక చొరవ చూపాలని నాయకులు సీఈఓకు విన్నవించారు. ఆయన వెంట మదనపల్లి డివిజన్ డీఎల్డీవో లక్ష్మీపతి, ఎంపీడీవో చంద్రశేఖర్రెడ్డి, డిప్యూటి ఎంపీడీవో ప్రతాప్రెడ్డి, ఎంఈఓ టూ గౌస్పీర్, ఏవో శ్రీధర్ తదితరులు ఉన్నారు.


