మదనపల్లెఅర్బన్: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు డిప్యూటీ ఎంపీడీఓలు, కార్యదర్శులు కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ పేర్కొన్నారు. గురువారం స్థానిక కార్యాలయంలో మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె, రామసముద్రం, మదనపల్లె మండలాలకు చెందిన డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం మెరు గుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పారిశుధ్యం లోపించిందన్నారు. దీంతో జనం వ్యాధుల బారినపడే అవకాశం ఉందని సూ చించారు. అలాగే తాగునీరు, సీసీరోడ్లు, వీధిలైట్లు, పైపులైన్ తదితర వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా మౌలిక వసతులపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకుండా చూసుకోవాలని.. ఇందులో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్త పడాలన్నారు. అనంతరం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్డీవోలు లక్ష్మీపతి, శ్రీనివాసులు, డీఎల్పీవో నాగరాజ, సిబ్బంది పాల్గొన్నారు.
డీపీవో రాధమ్మ


