పెద్దతిప్పసముద్రం : అన్నమయ్య జిల్లా మద్దయ్యగారిపల్లిలో గత మూడు రోజుల వ్యవధిలో నలుగురు మృత్యువాత పడటంతో బాధిత కుటుంబీకులు, ఆత్మీయుల రోదనలతో ఆ ప్రాంతం విషాదంతో నిండిపోయింది. ఒకే కుటుంబంలోని తల్లి, కుమారుడి అకాల మరణం చూపరులను కంట తడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే మద్దయ్యగారిపల్లికి చెందిన షేక్ మగ్బూల్, మైబూన్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఈ దంపతుల చిన్న కుమారుడు షేక్ మున్నా (35) నాలుగేళ్ల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. పెద్ద కుమారుడు షేక్ షామీర్ (45) బుధవారం అతిగా మధ్యం తాగి అపస్మారకస్థితికి చేరుకోవడంతో కుటుంబీకులు చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో గురువారం షామీర్ అంతిమ సంస్కారానికి బంధువులు సమాయత్తం అవుతుండగా మృతుడి తల్లి మైబూన్ (65) ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది. ఆమెను చికిత్స కోసం మండల కేంద్రంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇదిలా ఉండగా అర్ధంతరంగా కొడుకులిద్దరూ, ఇన్నాళ్లూ తనకు చేదోడు వాదోడుగా ఉన్న భార్య అనంత లోకాలకు వెళ్లిపోవడంతో షేక్ మగ్బూల్ లోలోపలే కుమిలిపోతున్నాడు.
కుమారుడి అంతిమ సంస్కారం
రోజే తల్లి మృతి


