సంబేపల్లె: మండల పరిధిలోని దేవపట్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం జిల్లా అదనపు వైద్యాధికారి రాధ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్యకేంద్రంలో నిర్వహించిన ఆశాడే కార్యక్రంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలోని సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాలొగన్నారు.
పాలిసెట్లో 90 శాతం పాస్!
మదనపల్లె సిటీ: పాలిసెట్–2026 ఫలితాల్లో జిల్లాలో 90.82 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను మంగళవారం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. గత నెల 25న జరిగిన ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 3397 మంది హాజరయ్యారు. ఇందులో 2005 మంది బాలురు, 1392 మంది బాలికలు హాజరుకాగా ఇందులో బాలురు 1796 మంది, బాలికలు 1289 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 89.58 శాతం, బాలికలు 92.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ముగ్గురికి టాప్ ర్యాంకులు సాధించినట్లు పాలిసెట్–26 జిల్లా కన్వీనర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. డి.సాదిక్ 229 ర్యాంకు, డేరంగుల రెడ్డిశేఖర్ 279 ర్యాంకు, చింతం రెడ్డిరూప 376 ర్యాంకు సాధించినట్లు తెలిపారు.
ఎన్ఆర్ఐలతో
ఆత్మీయ సమావేశం
రాయచోటి అర్బన్ : అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వర్జీనియా రాష్ట్రానికి చెందిన తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆత్మీ య సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు స్థానిక జీవన విధానం, అభివృద్ధి నమూనాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా భారతదేశంలో పేదరిక నిర్మూలనకు సమగ్ర ప్రణాళికలు ఎలా ఉండాలి, గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో సమాన అవకాశాలు ఎలా కల్పించాలి వంటి అంశాలపై విలువైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ప్రతి ఒక్కరితో సన్నిహితంగా మాట్లాడి, వారి అభిప్రాయాలను శ్రద్ధగా విన్నారు.
రాజంపేట వాసికి
ఉత్తమ డైరెక్టర్ అవార్డు
రాజంపేట టౌన్: దర్శకరత్న దాసరినారాయణరావు జయంతిని పురస్కరించుకొని దర్శకుల దినోత్సవం సందర్భంగా ఈనెల 4వ తేదీ హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాజంపేట మండలం ఎస్.ఎర్రబల్లెకు చెందిన ఆదిత్య వంశీ బెస్ట్ షార్ట్ఫిల్మ్ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. ఈవిషయాన్ని ఆయన మంగళవారం ఇక్కడి విలేకరులకు తెలిపారు. తన దర్శకత్వంలో రూపొందిన మధురం కదా బాల్యం, ఉత్తరం అనే షార్ట్ ఫిల్మ్లకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చినట్లు తెలిపారు. మధురం కదా బాల్యం, ఉత్తరం షార్ట్ఫిల్మ్లకు కథను, లిరిక్స్ను ప్రముఖ లిరిక్ రైటర్ ఎండి.రఫి అందించారని పేర్కొన్నారు.


