మదనపల్లె టౌన్: అర్బన్ హెల్త్ సెంటర్కు వైద్య చికిత్సల కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నరసయ్య సిబ్బందిని ఆదేశించారు. మదనపల్లె పట్టణం, త్యాగరాజ వీధిలో ఉన్న యూపీహెచ్సీని సోమవారం తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆసుపత్రికి వచ్చిన రోగులను పలకరించారు. సక్రమంగా వైద్యం అందుతుందా లేదా అని అడిగి తెలుసు కున్నారు.
బాధితులకు
న్యాయం చేయాలి
మదనపల్లె టౌన్: మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హాజరయ్యారు.అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్జీలను పరిశీలించి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని, చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చిన్నమండెంకు చెందిన బాధిత వృద్ధ రైతు సుబ్బారెడ్డి తన సమస్యను చిన్నమండెం పోలీసులు పట్టించుకోలేదని తెలియజేశారు. పుంగనూరు మండలం, ఎల్లారు బైలుకు చెందిన సుబ్రహ్మణ్యం తల్లి పేరున ఉన్న పట్టా భూమిని వీఆర్వోఓ శ్రీనివాసులు మరొకరికి చెందేలా గోల్ మాల్ చేశాడని, మదనపల్లెకు చెందిన ఏపీఎస్ఈబీ యూనియన్ 28 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి రిస్టర్ చేసుకున్న భూమిని రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి రామకృష్ణారెడ్డి నకిలీ పత్రాలతో కబ్జా చేశాడని ఫిర్యాదు చేశారు. ఇవే కాకుండా సుమారు 110 మంది బాధితులు భూ.. రెవెన్యూ సమస్యలకు సంబంధించి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.


