తిరుపతి సిటీ: తిరుపతి బైరాగిపట్టెడలోని బీవీకే విద్యా సంస్థల విద్యార్థులు గురువారం విడుదలైన పదో తరగతి పలితాల్లో ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా సీఈఓ అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ బీవీకే విద్యార్థులు పది ఫలితాల్లో రికార్డు స్థాయిలో మార్కులు సాధించి, ప్రబంజనం సృష్టించారని తెలిపారు. విద్యార్థులు కే వినతి 597, జాహ్నవి 595, జోష్యంత్ 592, మాన్యసాయి 591 సాధించారని చెప్పారు. 570 మార్కులకు పైగా 102 మంది విద్యార్థులకు రావడం పాఠశాలకు గర్వకారణమన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు విద్యార్థులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యా బోధన చేసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం తమ పాఠశాల లక్ష్యమని చెప్పారు. నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యార్థులను మెరిట్ స్టూడెంట్స్గా తీర్చిదితున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి అభినందించారు.
● మందు పార్టీ వద్ద చెలరేగిన వివాదం ● ఇరువురు పరస్పరం దాడి
చౌడేపల్లె : ఓ మామిడి తోటలో ఏర్పాటు చేసుకున్న మందు పార్టీ వద్ద చెలరేగిన వివాదం తారా స్థాయికి చేరింది. మాటకుమాట పెరగడంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగి, తర్వాత కారుకు నిప్పు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. చౌడేపల్లె మండలం పెద్దయల్లకుంట్ల పంచాయతీ చిప్పిలివారిపల్లెకు చెందిన హరిబాబు, అతని స్నేహితులు మరికొందరితో కలిసి కాగతి సమీపంలోని ఓ మామిడి తోటలో గురువారం రాత్రి మందు పార్టీ ఏర్పాటు చేసుకొన్నారు. అదే గ్రామానికి చెందిన మునిరాజ చౌడేపల్లె పోలీస్స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి హరిబాబుతోపాటు మరికొందరు కలిసి తామందరం ఉన్న చోటికి రావాలని ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో హరిబాబు, మునిరాజ మధ్య మాటకుమాట పెరగడంతో పరస్పరం దాడి చేసుకున్నారు. అక్కడి నుంచి హరిబాబు చౌడేపల్లె ప్రభుత్వాసుపత్రికి, తర్వాత పుంగనూరు ఆసుపత్రికి వెళ్లాడు. ఇంతలో ఏమి జరిగిందో ఏమో కానీ చిప్పిలివారిపల్లెలో హోంగార్డు మునిరాజ ఇంటి సమీపంలో రోడ్డుపక్కన నిలిపి ఉన్న కారుపై అర్ధరాత్రి సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలను గమనించిన స్థానికులు అదుపు చేయలేకపోవడంతో పుంగనూరు నుంచి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారని గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ సాయిప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనకు కారకులుగా అనుమానిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. కాగా కారుకు ఎవరు నిప్పు పెట్టారు? ఎందుకు పెట్టారో.. పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.


