రాయచోటి : ప్రచార ఆర్భాటాలు, నాయకులను ప్రసన్నాలు చేసుకోవడానికి, వ్యాపారం ప్రారంభోత్సవాల పేర్లతో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు వాహనదారులు, ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. పంచాయతీ, మున్సిపల్, రోడ్లు భవనాల జాతీయ రహదారుల శాఖల అధికారుల అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా వెలుస్తున్న ఫ్లెక్సీలు ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. రాయచోటి పట్టణంలోని ప్రధాన రహదారులు, కార్యాలయాల సముదాయాలు, డివైడర్లు, కూడల్లో అడ్డదిడ్డంగా వెలుస్తున్న ఫ్లెక్సీలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. కొయ్యలు, స్తంభాలు, గోడలకు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కొద్దిరోజులకే ఒరిగిపోయి రోడ్ల మీదకు వాలుతున్నాయి. దీంతో ఆ రహదారిన వెళ్లే ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాయి. ఒక్కొక్కసారి అనుకోకుండా కొయ్యలు విరిగిపోవడం వల్ల వేగంగా వెళ్తున్న వాహనాలు, ప్రజలపైన పడి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలలో విచ్చలవిడిగా వెలుస్తున్న ఫ్లెక్సీలు ఎక్కువ ప్రమాదాలకు నిలయంగా మారాయి. గురువారం రాత్రి భారీగా వీచిన ఈదురు గాలులకు రాయచోటి పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్, నేతాజీ సర్కిల్, మున్సిపల్, రెవెన్యూ కార్యాలయాల సముదాయాల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పడిపోయాయి. ఈ సమయాలలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదాలు తప్పిపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్న రాజకీయ, వ్యాపార ప్రకటనల ఫ్లెక్సీల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
అనుమతులు లేకుండా
అడ్డదిడ్డంగా వెలుస్తున్న వైనం


