గుర్రంకొండ: మండలంలోని తరిగొండలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి, నృసింహస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రియ భక్తులరాలైన ప్రముఖ రచయిత్రి వెంగమాంబ జన్మస్థలం తరిగొండ గ్రామం. ఇక్కడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలోనే వెంగమాంబ ఆలయం ఉంది. వెంగమాంబ, నరసింహస్వామి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం ఉదయం 6గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిపారు. 10గంటలకు ఆలయ ప్రాంగణంలో తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పలు రకాల నైవేద్యాలను సమర్పించి అభిషేకాలు, ప్రత్యేకపూజలు జరిపారు. టీటీడీకి చెందిన అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో మాతృశ్రీ వెంగమాంబ సంకీర్తన గోష్టిగానం, హరికథా కాలక్షేప తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
● మండలకేంద్రమైన గుర్రంకొండలో గురువారం నృసింహస్వామి జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయఅర్చకులు కిరణ్కుమార్శర్మ పాల్గొన్నారు.
కురబలకోట: కురబలకోట మండలంలోని వివిధ గ్రామాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న టమాటా, వరి పంటలను గురువారం స్థానిక వ్యవసాయ అధికారి వినుత, హార్టికల్చర్ అధికారి భూదేవి పరిశీలించారు. బుధవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసి టమాటా, వరి పంటలతో పాటు విద్యుత్ శాఖకు నష్టం సంభవించిన విషయం విదితమే. పంట నష్టం అంచనా వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు.మరో వైపు విద్యుత్ శాఖకు కూడా నష్టం వాటిల్లింది. కుక్కరాజు పల్లి క్రాస్ వద్ద చెట్టు పడి దెబ్బతిన్న 33 కేవీ లైన్ను పునరుద్ధరించారు. కొత్త గూడెం పల్లిలో దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు పనులు చేపట్టి విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టినట్లు ట్రాన్స్కో ఏఈ శంకర్ రెడ్డి తెలిపారు.


