పెద్దతిప్పసముద్రం: కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త అకాల మరణం ఆమెను బాధించింది. ఆరునెలల పసిపిల్లాడి భారం ఆమైపెనే పడింది. అయినా కూడా ఆత్మస్థైర్యంతో కష్టపడి కూలి పనులు చేస్తూ కన్న బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటూ చదివించింది. గురువారం వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో తన బిడ్డ మండల స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడంతో ఆ తల్లి ఆనందంతో ఉప్పొంగిపోయింది. లక్ష్మీ కటాక్షం లేకపోయినా సరస్వతీ దేవి నిండుగా దీవించిందని సంబరపడింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని రంగసముద్రానికి చెందిన దాలి పార్వతమ్మ, శంకర్ దంపతులకు ఒక్కగానొక్క సంతానం పవన్ సాయి. తల్లి కష్టాన్ని చూస్తూ ఎదిగిన పవన్ చదువుపై మక్కువ పెంచుకున్నాడు. రంగసముద్రం జెడ్పీ హైస్కూల్లో పది పూర్తి చేశాడు.తాజాగా విడుదలైన ఫలితాల్లో పవ్సాయి మండల స్థాయిలో 589 మార్కులు సాధించి మొదటి ర్యాంక్ సాధించాడు. భవిష్యత్తులో ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని ఈ విద్యార్థి పేర్కొన్నాడు. ఎంఈఓలు నారాయణ, గౌస్పీర్, హెచ్ఎం సరస్వతితో పాటు ఉపాధ్యాయులు పవన్సాయిని అభినందించారు.


