పిచ్చికుక్క దాడిలో బాలుడికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క దాడిలో బాలుడికి గాయాలు

Mar 31 2026 8:26 AM | Updated on Mar 31 2026 8:26 AM

సదుం : పిచ్చికుక్క దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన చెరుకువారిపల్లెలో సోమవారం సాయంత్రం జరిగింది. ఇంటి వద్ద కూర్చొని ఉన్న మస్తాన్‌పై పిచ్చికుక్క దాడి చేసింది. గాయపడిన బాలుడిని సదుం సీహెచ్‌సీకి వైద్యం కోసం తరలించారు. కుక్కల బెడద అరికట్టాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు.

అదృశ్యమైన వ్యక్తి మృతి

పెద్దతిప్పసముద్రం : బి.కొత్తకోట మండలానికి చెందిన చలపతి (55) అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా అదృశ్యమైనట్లు బాధిత కుటుంబీకులు అక్కడి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి మండలంలోని రాపూరివాండ్లపల్లి పంచాయతి కమ్మవారిపల్లి సమీపంలోని రోడ్డు పక్కన అచేతనస్థితిలో పడి ఉండటాన్ని సోమవారం గుర్తించిన పశు కాపరులు పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. ఎస్‌ఐ పరమేశ్‌ నాయక్‌ సిబ్బందితో వెళ్ళి సమగ్రంగా విచారించగా మృతుడు చలపతిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కారు ఢీకొనితల్లీ కుమారుడికి తీవ్ర గాయాలు

మదనపల్లె టౌన్‌ : కారు ఢీకొని తల్లీ కుమారుడు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. వివరాలు.. మదనపల్లె పట్టణం, రామిరెడ్డి లే ఔట్‌ వినాయకుని గుడి వద్ద నివాసం ఉంటున్న జానకి, ఆమె కుమారుడు నిఖిల్‌ ఇద్దరూ వాల్మీకిపురంలోని బంధువుల ఇంటికి శ్రీరామ నవమి వేడుకలకు ఆదివారం వెళ్లారు. తిరిగి రాత్రి ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వస్తుండగా కాశీరావు పేట సమీపంలోని హైవేరోడ్డు మేకలవారిపల్లె బస్‌ స్టాఫ్‌ వద్ద, కారు బైక్‌ను ఢీకొని వెళ్లి పోయింది. ఈప్రమాదలో తీవ్రంగా గాయపడిన బాధితులను స్థానికులు గమనించి ఆటోలో స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు.

బ్రహ్మోత్సవాల డ్యూటీలు తప్పుల తడక

కడప కార్పొరేషన్‌ : ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవానికి సంబంధించి వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని మల్టీపర్పస్‌ బృందాలుగా ఏర్పాటు చేసి డ్యూటీలు వేశారు. కాలమ్‌ నంబర్‌ 11లో వీఆర్‌లకు మాత్రమే డ్యూటీలు వేశారు. అయితే ఈ ప్రొసీడింగ్స్‌ అన్నీ తప్పుల తడకగా ఉన్నాయని తెలుస్తోంది. మరణించిన వారికి, బదిలీ అయిన వారికి, పదోన్నతి వచ్చి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి సైతం ఇక్కడ డ్యూటీలు వేయడం పట్ల ఉద్యోగులు విస్తుపోతున్నారు. 2025 సచివాలయ ఉద్యోగుల డేటా తీసుకొని ఆదరా బాదరాగా డ్యూటీలు వేసినట్లు దీనిద్వారా స్పష్టమవుతోంది. సీరియల్‌ నంబర్‌.6లో డి. గంగన్న సిద్దవటం మండలం జ్యోతి గ్రామంలో వీఆర్‌ఓగా ఉండి రెండు నెలల క్రితం చనిపోయారు. ఆయనకు బ్రహ్మోత్సవాలకు డ్యూటీ వేశారు. సీరియల్‌ నంబర్‌–42లో దేవానంద కుమార్‌ అన్నమయ్య జిల్లా రాయచోటికి బదిలీ అయ్యారు. సీరియల్‌ నంబర్‌–7లో డి. సుబ్రమణ్యం పోరుమామిళ్లకు, సీరియల్‌నంబర్‌–8లో ఏ.సురేష్‌ రాజంపేటకు బదిలీ అయ్యారు. అలాగే జి.మధుసూదన్‌ బద్వేల్‌కు, బి.శ్రీనివాసులు వల్లూరుకు, బి.రామచంద్రారెడ్డి పోరుమామిళ్లకు. జి.గురు నరసింహ సిద్దవటంకు ట్రాన్స్‌ఫర్‌ అయి ఉన్నారు. సీరియల్‌నంబర్‌–30లో ఉన్న కుమార్‌ సిద్దార్థ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇతర దేశాలకు వెళ్లిపోయారు. ఈయనకు కూడా బ్రహ్మోత్సవాల్లో డ్యూటీ వేశారు. సీరియల్‌ నంబర్‌–91 వై. వేణుగోపాల్‌ సస్పెండ్‌ అయ్యారు. సీరియల్‌ నంబర్‌–44లో ఉన్న శేషారెడ్డి మూడేళ్ల క్రితం పదోన్నతి పొంది సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్నారు. ఆయనకూ డ్యూటీ వేశారు. కె. సుబ్బరామయ్య అనే వీఆర్‌ఓకు నందలూరులో, కడపలో రెండు చోట్లా డ్యూటీ వేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement