● వైభవంగా పట్టాభిరాముడి రథోత్సవం
● మార్మోగిన రామనామస్మరణ
వాల్మీకిపురం : శ్రీ పట్టాభిరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు సోమవారం ఉదయం స్వామివారి రథోత్సవం వైభవంగా సాగింది. ఉత్సవర్లను శోభాయమానంగా అలంకరించి రథంపై కొలువుదీర్చిరు.తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల రామనామస్మరణతో ఆప్రాంతమంతా మార్మోగింది. డప్పు, వాయిద్యాలు, భజన బృందాల కోలాటాలు, సంకీర్తనల నడుమ కోలాహాలంగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.రథోత్సవం అనంతరం రథం యథాస్థానానికి చేరిన తర్వాత స్వామివారిని తిరుచ్చిలోకి వేంచేపు చేసి హారతి ఇచ్చారు. వేకువజామున మూలవర్లకు తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం,అర్చన, మొదటి గంట, శాత్తుమొర కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి. పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, సిబ్బంది, జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 8నుంచి 9గంటల వరకు తిరుచ్చి ఉత్సవం, 10 నుంచి స్నపన తిరుమంజన, సాయంత్రం 6 నుంచి ఊంజల్ సేవ, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారి పార్వేట ఉత్సవం.


