రామసముద్రం : మండల కేంద్రంలోని దిగుపేటలో క్షుద్ర పూజలు చేయడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలా పూజలు చేశారన్న వార్తలు దావానంలా వ్యాపించడంతో మండల ప్రజల్లో కలకలం రేగింది. దిగువపేటకు చెందిన చాంద్ బాషా ఇంటి ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రి క్షుద్రపూజలు చేసి అక్కడే ఒక పాలిథిన్ కవర్లో కోడి కాళ్లు, పసుపు, కుంకుమ, దారాలు పెట్టి వదిలేసి వెళ్లారు. ఉదయం గమనించిన ఆయన భార్య కుషిద్ బేగం భయాందోళనకు గురై కుటుంబీకులకు సమాచారం అందించింది. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనతో స్థానిక, మండల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు.


