గాలివీడు : మండల కేంద్రంలోని బస్టాండ్ నుంచి పెద్దూరుకు వెళ్లే మార్గంలో మసీదు సమీపంలో నివాసం ఉంటున్న మునిరాజు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా ఇంట్లో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు 4 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై నరసింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.
బొలేరో ఢీకొని తాత, మనవరాలికి గాయాలు
మదనపల్లె టౌన్ : బొలేరో ఢీకొని తాతా మనవరాలు తీవ్రంగా గాయపడ్డ సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్ బాలసముద్రానికి చెందిన వీరప్ప తన మనవరాలు హిమశ్రీ(7)ని ద్విచక్ర వాహనంలో కూర్చో పెట్టుకుని మదనపల్లెలో ఉన్న బంధువుల ఇంటికి బయలు దేరాడు. బైక్ మార్గంమధ్యలోని మదనపల్లె పట్టణం రింగ్ రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఓ బొలేరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తాత, మనవరాలిని స్థానికులు 108లో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై రెండో పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నారు.
రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని మృతదేహాలు
కడప అర్బన్: కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)కు చికిత్స కోసం వేర్వేరు రోజుల్లో వచ్చిన ఇద్దరు తీవ్ర అనారోగ్యంతో వేర్వేరు సమయాలలో మృతి చెందారు. వారి మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీలో వుంచారు. వీరి ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలియజేశారు.
గాయపడిన తాత, మనవరాలు వీరప్ప, హిమశ్రీ


