మదనపల్లె టౌన్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం కురబలకోట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె మండలం ఆర్సి వడ్డిపల్లికి చెందిన సుధాకర్(45) కులబలకోట మండలం అంగళ్లులో కాపురం ఉంటూ ఆటో నడుపుకొని భార్య పిల్లల్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గత కొంత కాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులలో చూపించినా డబ్బు ఖర్చు తప్ప జబ్బు నయం కాలేదు. శుక్రవారం మరోసారి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో భరించలేక పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బావిలో పడి వృద్ధురాలి మృతి
గాలివీడు : మండలంలోని నూలివీడు పంచాయతీ నాగూరువాండ్లపల్లెకు చెందిన నరసమ్మ(86) నూలివీడు కస్పాకు సమీపంలోని బావిలో పడి మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నాగూరువాండ్లపల్లికి చెందిన నరసమ్మ కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడి కంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉండేదని, అక్కడ స్థానికులు కనుగొని తమకు అప్పగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. గురువారం రాత్రి కూడా తమ ఇంటిలోని ఉన్నదని, అర్ధరాత్రి సమయంలో లేచి వెళ్లిపోయిందని, ఉదయం చూసేటప్పటికి ఇంటిలో లేకపోవడంతో చుట్టుపక్కల గాలించామన్నారు. ఈ క్రమంలో నూలివీడుకు సమీపంలోని బావిలో శవమై తేలిందని తెలిపారు. ఈ సంఘటనను స్థానిక పోలీసులకు తెలియజేశామన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ నరసింహారెడ్డి తెలిపారు.


