రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో హుండీ ఆదాయన్ని లెక్కించారు. బుధవారం స్వామి వారి ఆలయంలో 51 రోజులకు సంబంధించి ప్రధాన అలయంతో పాటు ఉప ఆలయాల హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఈ లెక్కింపులో శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి చెందిన హుండీ ద్వారా రూ.15.39,540లు, అమ్మవారి ఆలయానికి సంబంధించి రూ.2,90,340,శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి రూ.78,500లు, అఘోరలింగేశ్వర స్వామి ఆల యంలో రూ.72,894, సుబ్రహ్మణ్యం స్వామి, శ్రీకాల కాలభైరవుడు, నవగ్రహ మండపం హుండీ ఆదాయం రూ.49,020లుగా లెక్కంచారు. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో జమ చేసినట్లు, అన్నదాన కార్యక్రమానికి రూ.86,570 స్టేట్ బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్కుమార్, ఆలయ ఈవో డివి రమణారెడ్డిలు ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది.
పాముకాటుతో మహిళా రైతుకు అస్వస్థత
మదనపల్లెటౌన్ : మహిళా రైతును విషసర్పం కాటేసిన సంఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. వివరాలు.. కోటవారిపల్లె పంచాయతీ, పాలెం దొనకు చెందిన రైతు జయచంద్ర భార్య తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. పాడి పశువులకు గడ్డి కోసి వేసే సమయంలో గడ్డిలో ఉన్న ఓ విష సర్పం శైలజ కాలిపై కాటేసింది. ఆమె కేకలు వేయడంతో భర్త, కుటుంబీకులు గమనించి శైలజ వద్దకు వెళ్లారు. పరిసరాలను పరిశీలించి విషసర్పాన్ని గుర్తించి చంపేశారు. అనంతరం బాధితురాలిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్లు పరీక్షించి, ప్రథమ చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటోంది.
అరటి రైతును ఆదుకోవాలి: షర్మిల
కడప సెవెన్రోడ్స్ : అకాల వర్షాలు, ధరల పతనంతో నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బుధవారం కడపలో జాయింట్ కలెక్టర్ నిధి మీనాకు ఆమె వినతిపత్రం సమర్పించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో టన్ను రూ. 26 వేలు పలికిన అరటి ధర, ప్రస్తుతం రూ. 6 వేలకు పడిపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని రూ. 10–12 వేల మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. పులివెందుల ప్రాంతంలో జీ–9 రకం అరటి సాగు ఎక్కువగా ఉన్నందున, అక్కడ కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు, 2023–24 ఏడాదికి సంబంధించిన బీమా సొమ్మును తక్షణమే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.అంతకుముందు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ను సందర్శించి, తన తండ్రి సమాధికి ఘనంగా నివాళులర్పించారు.


