పుంగనూరు : ఎన్నో ఏళ్లుగా ఆలయ ధర్మకర్తలు, ఎండోమెంట్ శాఖ చేస్తున్న న్యాయపొరాటంలో ఎట్టకేలకు ఎండోమెంట్ వారు విజయం సాధించారు. పుంగనూరులోని లక్షలాది రూపాయల ఆదాయం ఉన్న శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని శుక్రవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ ఆలయానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమించి, ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో పి.రమణ సీఐ సుబ్బరాయుడు, సీనియర్ న్యాయవాది వెంకట్రామయ్యశెట్టితోపాటు పట్టణ ప్రముఖుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలో దేవదాయ శాఖ హుండీని ఏర్పాటు చేసి, బోర్డులు ఏర్పాటు చేశారు. ఈవో రమణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయాన్ని స్వాధీనం చేసుకుని సీల్ చేసిన హుండీని ఆలయంలో పెట్టి, తాళాలు జిల్లా అధికారులకు పంపామన్నారు. త్వరలోనే ఆలయానికి సంబంధించిన నగలు, నగదు, ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.


