మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీకి సంబంధించిన గుత్తల అప్పగింతకు నిర్వహించిన టెండర్లు, వేలంపాటలకు కేవలం ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. ఆ ఇద్దరే మూడు గుత్తలకు సంబంధించిన పాటపాడారు. మూడో వ్యక్తి వీటిలో పాల్గొనలేదు. ఏటా గుత్తల కోసం పోటిపడే పాటదారులు ప్రస్తుతం ఎందుకు ముందుకు రావడం లేదన్న చర్చ ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ఫిబ్రవరి ఏడవ తేది నుంచి బుధవారం వరకు ఐదు సార్లు వేలంపాటలు నిర్వహించగా..పాల్గొన్న ఇద్దరు చాలా తక్కువ మొత్తాలకు పాట పాడారు. ఐదోసారి (బుధవారం) నిర్వహించిన వేలంపాటలో వారపు సంత, జంతువధశాల గుత్త కోసం ప్రసాద్, రెడ్డి షంషీర్ అనే ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. ఈ పాట నిర్ణయించిన మొత్తంలో సగానికి సగమే పాడా రు. వారపు సంతకు రూ.47.60 లక్షలుగా నిర్ణయించి టెండర్ నిర్వహించగా ప్రసాద్ రూ.21 లక్షలకు, రెడ్డి షంషీర్ రూ.20 లక్షలకు దాఖలు చేశారు. తర్వాత వేలంపాట నిర్వహించగా ప్రసాద్ రూ.24.50 లక్షలకు పాట పాడారు. అంటే నిర్ణయించిన ధరలో రూ.24 లక్షలు తక్కువ పాడారు. అలాగే జంతువధశాలకు రూ.2.10 లక్షలతో టెండర్ నిర్వహించగా రెడ్డి షంషేర్ రూ.1.60 లక్షలకు, ప్రసాద్ రూ.1.62 లక్షలకు టెండర్ వేశారు. దీనికి వేలంపాట నిర్వహించగా రెడ్డి షంషేర్ రూ.1.70 లక్షలకు పాడారు. కాగా నాలుగో సారి నిర్వహించిన దినసరి మార్కెట్ గుత్తకు రూ.1,20,40,000తో టెండర్ నిర్వహించగా ప్రసాద్ రూ.73 లక్షలకు, రెడ్డి షంషీర్ రూ.71 లక్షలకు టెండర్ వేశారు. దీనికి వేలం పాట నిర్వహించగా ప్రసాద్ రూ.78 లక్షలకు పాడారు.
రూ.65 లక్షలు నష్టపోతారా..
గుత్తల వేలంపాటలకు సంబంధించి మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం రావాల్సి ఉంది. పాటదారులు ఎవరు రాకపోవడంతో ఇద్దరు మాత్రమే ప్రతిపాటకు హాజరవుతున్నారు. ఈ వేలం పాటల్లో నిర్ణయించిన ధర కంటే రూ.65 లక్షలు తక్కువకు వేలంపాట జరగడం విశేషం.
టెండర్ ధరకంటే తక్కువకు పాడిన పాటదారులు
వీటిని ఆమోదిస్తే మున్సిపాలిటికి రూ.65 లక్షలు నష్టం


