మదనపల్లె: బాలికల ఆరోగ్యం కాపాడేందుకే హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు అన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో వ్యాక్సిన్ పోస్టర్లను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ను నివారించడంలో టీకా సురక్షితం, ప్రభావంతమైనదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఉషశ్రీ, కలెక్టరేట్ ఏవో నాగభూషణం, మదనపల్లి, రాయ చోటి, లక్కిరెడ్డిపల్లి తహసీల్దార్లు పాల్గొన్నారు.
మదనపల్లె: మున్సిపల్ కౌన్సిల్ పాలకవర్గాలకు ఈనెల 16వ తేదీతో గడువు ముగుస్తుండటంతో ప్రభుత్వం మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వు జారీ చేసింది. మదనపల్లె సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీకి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, స్పెషల్ గ్రేడ్ రాయచోటి మున్సిపాలిటీకి రాజంపేట ఆర్డీఓ, పుంగనూరు గ్రేడ్–2 మున్సిపాలిటీకి చిత్తూరు ఆర్డీఓలను నియమించారు.
పీలేరురూరల్: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి 244 బ్యాంకుల ద్వారా రూ. 16,619 కోట్లు రుణాలు లక్ష్యం కాగా రూ. 18,042 కోట్లు రుణాలు పంపిణీ చేసి లక్ష్యాన్ని అధిగమించినట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ జి. ఆంజినేయులు అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బ్యాంకు మేనేజర్లు, వెలుగు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రుణాలు రూ. 12,272 కోట్లకు గానూ రూ. 12,533 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ. 14,94 కోట్లుకుగానూ రూ. 12.09 కోట్లు రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలో ముద్ర రుణాలు 18,665 యూనిట్లకు గానూ రూ. 436 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు. 14,062 గ్రూపులకు రూ. 13.45 కోట్లు రుణాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. రుణాలు రికవరీ సకాలంలో చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఎం ఆర్. లక్ష్మీప్రసాద్రెడ్డి, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్: కడపలోని పురుషుల ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి) ఆడిటోరియంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, నానో మెటీరియల్స్, డివైజెస్పై ఈ నెల 16న జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.ఎం.రవి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత నిపుణులు, పరిశోధకులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నట్లు చెప్పారు.ఈ సదస్సును వై.వి.యూనివర్శిటీ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ , విక్రమ్ సింహపురి యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాస్ రావు, కాలేజియేట్ ఎడ్యుకేషన్ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ డాక్టర్. కే. జ్ఞానేశ్వర్,లు ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమ కన్వీనర్ డా.బి.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నానో పదార్థాల పరిశోధనల సామర్థ్యాలను పెంపొందించడానికి పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణుల మధ్య విజ్ఞాన భాగస్వామ్యం, సహకారంతోపాటు నెట్వర్కింగ్ కోసం ఒక వేదికను అందించడం ఈ సదస్సు లక్ష్యం అని తెలిపారు.


