● ఎమ్మెల్యే అమర్ బ్యానర్లు చించడంపై ఘర్షణ
● కమిషనర్పై అమర్ గ్రూప్ మండిపాటు
పుంగనూరు : పుంగనూరులో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ పలమనేరు సీనియర్ ఎమ్మెల్యే అమరనాథరెడ్డితో పాటు ఇతర మంత్రులతో కలసి గంగజాతర శుభాకాంక్షలు తెలుపుతూ కాపు సంఘ నాయకులు, మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్, మధుసూదన్రాయల్ బస్టాండ్లో బ్యానర్లు ఏర్పాటు చేశారు. సోమవారం దీనిని గమనించిన మరోవర్గం తమ్ముళ్లు ప్రొటోకాల్తో వేసిన అమరనాథరెడ్డి బ్యానర్లను కమిషనర్తో కుమ్మకై తీసేయించారు. దీనిపై అమరనాథరెడ్డి వర్గం నాయకులు సుబ్రమణ్యంరాజు, పర్వేజ్, అఫ్రోజ్, సయ్యద్, పరమేష్ తదితరులు మున్సిపాలిటీకి చేరుకుని కమిషనర్ వాహనాన్ని అడ్డుకున్నారు. అమరనాథరెడ్డితో సహా పీఎం, సీఎం ఉన్న బ్యానర్లను ఎందుకు పీకించాశావ్.. నీకు అధికారం ఎవరు ఇచ్చారు.. అలా అయితే పట్టణంలో కట్టిన బ్యానర్లు అన్ని తీసేయిస్తావా ...అమరనాథరెడ్డి బ్యానర్లు కట్టిన ప్రతి సారి ఇలానే చించేస్తున్నారు..ఇక సహించేది లేదని, పుంగనూరు ఏవరబ్బ జాగీరుదారు కాదని, ఇలాంటివి చూస్తూ ఊరుకోం అంటు ఒక్కసారిగా అమర్ వర్గం నాయకులు రెచ్చిపోయారు. కమిషనర్ కూడా తగ్గేది లేదంటూ..నా ఇష్టం అడగటానికి మీరు ఎవరు... అంటు తమ్ముళ్లపై మండిపడ్డారు. ఒక దశలో మాటలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పలువురు ఇరువర్గాలను శాంతింపచేశారు.
దీనిపై కమిషనర్ మున్సిపాలిటీ తరపున చించివేసిన బ్యానర్లను మళ్లీ ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య తగ్గింది. కాగా తెలుగుదేశం అంతర్గత విబేధాలు రోజురోజుకు తారాస్థాయికి చేరడం, కమిషనర్ను పావుగా వాడుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.


