రొంపిచెర్ల : రోడ్డు ప్రమాదంలో రొంపిచెర్ల మండలం గానుగచింత దాసరిగుడెంకు చెందిన సుబ్బరామయ్య (67) మృతి చెందారు. సోమవారం ఉదయం అనంతపురం – చైన్నె జాతీయ రహదారిలో తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం యండపల్లెవారిపల్లె సమీపంలో రోడ్డు దాటుతుండగా బెంగుళూరు నుంచి అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్బరామయ్య అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో గానుగచింత దాసరిగుడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య శంకరమ్మ 7 నెలల కిత్రం ఆనారోగ్యంతో మృతి చెందారు. కాగా అతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లెటౌన్ : కారు ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం జరిగింది. ప్రమాదానికి సంబంధించి బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. ములకలచెరువులో కాపురం ఉంటున్న గంగాధర్ కుమారుడు రమేష్(32) కూలి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో కూలి డబ్బు రావాల్సి ఉండటంతో స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్దకు వెళ్లాడు. రోడ్డు పక్కన నిలబడి డబ్బులు తెస్తున్న మనిషి కోసం వేచి ఉండగా, కదిరి వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ కారు గంగాధర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కాలు విరిగి తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికుల సాయంతో కుటుంబీకులు 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి చికిత్సకు తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం అతడిని తిరుపతికి తీసుకువెళ్లాలని రెఫర్ చేశారు. ఘటనపై ములకలచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


